ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ‘ప్రొటెక్షన్ సెల్’
అదనపు డీసీపీ కుశాల్కర్
సిద్దిపేట క్రైం, ఆగస్టు 19(విజయక్రాంతి) : ట్రాన్స్జెండర్లకు తక్షణ సహాయం, రక్షణ అందించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహిళా పోలీసు స్టేషన్లో ‘జిల్లా ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్‘ ను ఏర్పాటు చేసినట్టు అదనపు డీసీపీ(అడ్మిన్) కుశాల్కర్ తెలిపారు. వారి ప్రాథమిక హక్కులు, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా కాపాడటం, వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించడం కోసం ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
జిల్లా ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ నోడల్ ఆఫీసర్గా కుశాల్కర్ వ్యవహరిస్తారు. పీసీఆర్ ఇన్స్పెక్టర్ పి.మల్లేశం గౌడ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏబీ దుర్గలకు సెల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాన్స్జెండర్లు ఎలాంటి సమస్యలు ఎదురైనా, భయాందోళనలకు గురికాకుండా ప్రొటెక్షన్ సెల్ అధికారులను సంప్రదించి చట్టపరమైన రక్షణ పొందవచ్చని కుశాల్కర్ సూచించారు.






