29-09-2025 12:34:14 AM
లక్ష్యం ఘనం... ఆచరణ శూన్యం
బూర్గంపాడు,సెప్టెంబర్28, (విజయక్రాంతి):గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు, యువత, విద్యార్థుల్లో క్రీడలు, వ్యాయామం పట్ల ఆసక్తిని పెంచేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగ మవుతూ నిర్లక్ష్యం నీడలో, కొట్టుమిట్టాడుతున్నాయి.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బూర్గంపాడు మండలంలోని 18గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామీణ క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమై అలంకార ప్రాయంగా నిలుస్తున్నాయి. ఒక్కో క్రీడా ప్రాంగణానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు లక్షల నిధులతో చేపట్టేందుకు అంచనాలను తయారు చేశారు.
ప్రతి గ్రామంలో రెండు ఎకరాల స్థలాన్ని ఎంపికచేసి ఆటలకు అనువుగా ఉండే విధంగా చదును చేసి, చుట్టూ కంచె పెట్టి నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలి. చక్కటి ఆహ్లాదకర మైన వాతావరణం ఉండేలా చెట్లను నాటించాలి. వ్యాయామం కోసం సింగిల్ బార్, డబుల్ బార్ లను, ఆటల కోసం ఖోఖో పోల్ , లాంగ్ జంప్, హై జంప్ వంటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి సుమారు రూ.50వేల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.
చిత్తశుద్ధి ఏదీ..?
గ్రామాల్లోని యువత, విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడల పట్ల దృష్టి సారించి ఖాళీ సమయంలో ఆటలు ఆడుకునే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా మైదానాలు ఆచరణలో చిత్తశుద్ధి కనిపించక పోవడంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. అధికారులు, పంచాయతీ పాలకవర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఊరికి దూరంగా,
అనుకూలంగా లేని చోట కేవలం నేమ్ బోర్డులు పెట్టి గత మూడేళ్ల క్రితం నామమాత్రపు పనులు చేసి వదిలే యడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన క్రీడా మైదానాలు చెత్తా, చెదారం, పిచ్చి మొక్కలతో నిండి ఉన్నాయి.
ఈ ప్రాంతాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఎవరు ఆసక్తిని చూపడం లేదు. ఇప్పటికైనా గ్రామీణ క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.