ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
కాళేశ్వరం, మార్చి 2౬ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో అధ్యయనోత్సవాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, ఈ ఉత్సవాలు శనివా రంతో ముగియనున్నాయి.
శుక్రవారం ఉదయం 10 గంటల 31 నిమిషాలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కళ్యాణ మహో త్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున భక్తుల కోసం నీడ టెంట్లు, త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
గురువారం ఉదయం పాల పొరక తీసుకువచ్చి ఆలయం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రబంధ పారాయణం అనంతరం ఉత్సవమూర్తులకు ఎదురుకోలు సేవ నిర్వహించారు.శుక్రవారం ఉదయం సీతారాముల కళ్యాణం అనంతరం రాత్రి హవనం, బలిహరణం కార్యక్ర మాలు జరగనున్నాయి.
శనివారం ఉదయం పూర్ణాహుతి, చక్రవరీ అనంతరం సాయంత్రం పుష్పయాగం, నాకబలి, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేష్ ఒక ప్రకటనలో కోరారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే దంపతులు రూ.1000 రుసుము చెల్లించినచో వారికి స్వామివారి శేష వస్త్రాలు మరియు ప్రసాదం అందజేయబడునని తెలిపారు.




