31-10-2025 01:14:55 AM
 
							* జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
* జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, అక్టోబర్ 30 (విజయక్రాంతి):ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలీఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.
ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తేమ శాతం చూసి కొనుగోలు చేయాలని, వర్షం వల్ల పూర్తిగా తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్ రైస్ మిల్లులకు తరలించాలన్నారు. నవంబర్ మొదటి వారంలో ఇంకా ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. విధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట హవేలీ ఘన్పూర్ తహసిల్దార్ సింధు రేణుక, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.