8 August, 2026 | 12:59 PM

గురుకుల విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో స్వర్ణ పతకం

08-08-2026 12:21 PM

ఘట్ కేసర్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి అంకుషాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, మహేంద్ర హిల్స్ అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన క్రీడాకారిణి తేజశ్రీ రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీల్లో సత్తా చాటింది. ఈ నెల 7, 8 తేదీల్లో హనుమకొండ లో నిర్వహించిన 5వ జాతీయ జావెలిన్ త్రోదినోత్సవం సందర్భంగా జరిగిన తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తేజశ్రీ జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ తెలిపారు.

ఈసందర్భంగా తేజశ్రీ ని అభినందిస్తూ మెడల్ వేసి సర్టిఫికెట్  అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...  క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధనతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకుని, పట్టుదలతో సాధన చేస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించవచ్చని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రత్యూష, కళాశాల అధ్యాపక బృందం, అథ్లెటిక్స్ కోచ్ బిక్షపతి, హ్యాండ్ బాల్ కోచ్ పద్మిని గుప్త తదితరులు పాల్గొన్నారు.