calender_icon.png 3 May, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో గాలివాన బీభత్సం

02-05-2025 11:01:49 PM

వరి, మామిడికి నష్టం

దెబ్బతిన్న ఇండ్లు

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన గాలి, వడగండ్ల వాన బీభత్సానికి జిల్లాలోని నేన్నెల, కన్నెపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్ తదితర మండలాల్లో మామిడి, వరి పంటలతో పాటు గ్రామాలలోని పలువురి ఇండ్లు దెబ్బతిన్నాయి. జిల్లా రైతన్నలను వడగండ్ల వాన తీవ్రంగా నష్ట పరిచింది. 

వరి, మామిడికి నష్టం

జిల్లాలో ప్రధానంగా జైపూర్, భీమారం, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 527 మంది రైతులకు చెందిన సుమారు 1400 ఎకరాలలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది, 90 మంది రైతులకు చెందిన సుమారు 135 ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఆవడం లాంటి ప్రాంతాలలో పెద్ద పెద్ద మామిడి చెట్లు విరిగి పోయాయి. హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు ప్రాథమికంగా అంచన వేసి జిల్లా స్థాయి అధికారులకు నష్టం వివరాలను అందజేశారు. చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతులు కన్నీరు పెట్టారు. రేపో మాపు మామిడి పంట కోసి మార్కెట్ కు తరలిద్దామనుకున్న రైతులకు తీవ్ర నిరాశనే ఎదురయ్యింది. విత్తన పంట, ఆడ మగవడ్లు గాలి వానకు దెబ్బతిని అనుకున్న ధర వస్తుందో, లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా కోసి ఆర బోసిన పరిధాన్యం వర్మంకు దడిసి ముద్దయింది.

దెబ్బతిన్న ఇండ్లు...

 జిల్లాలో గాలివాన బీభత్సంతో పెద్ద మొత్తంలో ఇండ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా భీమారం, నెన్నేల, జైపూర్ మండలంలో గృహాలు దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు నెన్నెల మండలం గంగారం, ఆవుడం, చిన్నవెంకటాపూర్, కొత్తూర్, ఘన్పూర్, చిత్తాపూర్, నెన్నెల, ఘన్పూర్, నందులపల్లి గ్రామాలలో పలువురి గుడిసేలు, రేకులు, పెంకుటిల్లు దాదాపు రెండు వందల వరకు దెబ్బతిన్నాయి. రేకులు, ఇండ్ల పైకప్పులు ఎక్కడిక్కడ లేచి కొట్టుకు పోయాయి. గాలి వాన వలన ఇండ్లలో రాత్రి వేళ నిద్రిస్తున్న పలువురికి గాయలయ్యాయి. మూగజీవాలు, పశుపక్షాదులు సైతం దెబ్బతిన్నాయి.  పలు గ్రామాలలో విద్యుత్ తీగలు, స్థంబాలు కూలిపోయినవి. జిల్లాలో 176 విద్యుత్ స్తంభాలు, 14 వరకు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.