23-07-2025 12:00:00 AM
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం, జూలై 22 (విజయ క్రాంతి): పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి మంగళవారం ఖమ్మం విజయ డైయిరీ యూనిట్ తనిఖీ చేసి,15వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం 1975 లో విజయ డైయిరీ యూనిట్ ప్రారంభమైందని, ప్రస్తుతం ఆ భవనం వెంటనే రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డైరీ యూనిట్ నందు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, మంచి నీరు కూడా మున్సిపాల్టీ నుంచి సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
విజయ డైరీ చుట్టుపక్కల కాలనీలోని డ్రైన్లు సంస్థలోకి వస్తున్నాయని, దీని కోసం డ్రైన్ డైవర్షెన్, కాంపౌండ్ వాల్ నిర్మాణంపై కార్యాచరణ చేయాలని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో విజయ డైరీ చిల్లింగ్ యూనిట్ల ఆధునీకరణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.మన రాష్ట్రంలో పాడి ఉత్పత్తులు తగ్గి పోవడం వ ల్ల ఇతర రాష్ట్రాల నుంచి పాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని,
యూరియాతో తయారు చేసే కల్తీ పాలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు.తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సం స్థ ఎండి చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాడి, పంట ఉన్న గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని అన్నారు.అనంతరం మంత్రి కొత్తగూడెం ఎస్సీ కాలనీ నందు 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు,
ఖమ్మం నగరం 15వ డివిజన్ లోనీ కొత్తగూడెం వెటర్నరీ హాస్పిటల్ రోడ్డు నందు 25 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు క్రొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, ఖమ్మం ఆర్డిఓ నర్సింహరావు, విజయా డెయిరీ డిడి రవికుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.