04-12-2025 12:00:00 AM
మిర్యాలగూడ డిసెంబర్ 3 విజయక్రాంతి: భవిత కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఎంపీడీవో శేషగిరిశర్మ అన్నారు. బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక భవిత కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మండల విద్యాధికారి బాలునాయక్ కలిసి మాట్లాడుతూ భవిత కేంద్రంలో వివిధ రకాలైనటువంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యాబోధన ఫిజియోథెరపీ, నిర్వహించ బడుతున్నాయన్నారు.
ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఎస్కార్ట్ అలవెన్సులు కూడా అందజేయడం జరుగుతుందని, మైనర్ కరెక్టివ్ సర్జరీస్ అవసరమైనటువంటి విద్యార్థులకు ఉపకరణాలు చెవులు సరిగా వినిపించని వారికి వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ ట్రై సైకిల్స్ చంక కర్రలు వంటి అందజేయడం జరుగుతుందన్నారు.
మేనరికం వివాహాల వలన వైకల్యాలు కలిగే అవకాశం ఉందని, వీలైనంతవరకు మేనరికం వివాహాలను నివారించడానికి అందరు ప్రయత్నించాలన్నారు. వైకల్యం కలిగిన పిల్లల తల్లిదండ్రులు నిరుత్సాహం చెందవద్దని వారికి తగినటువంటి చేయూత అందిస్తే సమాజంలో అందరితో పాటు ప్రభుత్వం పలు రకాల రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పిస్తుందని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఆటలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ మాతంగి రమేష్, స్పెషల్ బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ కోటయ్య, స్పెషల్ ఎడ్యుకేటర్స్ తదితరులు పాల్గొన్నారు.