03-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ను వినతి పత్రం
అందజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ జూలై 2 (విజయక్రాంతి): పవిత్రమైన వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం పేరుతో నీటి వనరులు కాలుష్యం అవుతున్నాయని, తద్వారా జీవకోటికి ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ ప్రధాన కార్యదర్శి ఏ సంజీవ్ ముదిరాజ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో గణేష్ విగ్రహలను తయారుచేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. విగ్రహాల తయారీలో ప్రాణాంతకమైన కెమికల్స్ సీసం, మెర్క్యూరీ, కాడ్మియం వంటివి వాడుతున్నారని, వాటి వాడకం వల్ల మనుషులతో పాటు జంతు జీవరాశి ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.
వినాయక ప్రతిమలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కెమికల్స్ తో తయారు చేసి చెరువులు, కుంటలు, నదులు, రిజర్వాయర్లలో నిమజ్జనం చేయడం ద్వారా చేపలు మృత్యువాత పడటంతో పాటు వన్యప్రాణులు, జంతువుల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. నీటి వనరులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్య కార్మికుల బతుకులు ఎండమావిగా మారుతున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి గంజి ఆంజనేయులు, ఉమ్మడి జిల్లా మత్స్య కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, హన్వాడ మండల పండుగ సాయన్న కమిటీ ఉపాధ్యక్షుడు బాలు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.