calender_icon.png 21 November, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను వంద శాతం సాధించాలి

16-08-2024 04:22:36 PM

రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి (విజయక్రాంతి): ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాలిక  ప్రకారం  బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను వంద శాతం సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం ఉదయం ఐ.డి. ఒ.సి సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ సంప్రదింపుల సమావేశానికి రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 2016 తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో  సాగు నీటి లభ్యత పెరిగి వ్యవసాయంతో పాటు రైతుల ఆర్థిక స్థోమత పెరిగిందన్నారు.

అదేవిధంగా రైతుల రుణమాఫీ సైతం జరిగి బ్యాంకుల రుణాలు అన్ని తిరిగి జమ అయ్యాయని,  అందువల్ల అదేస్థాయిలో బ్యాంకర్లు రైతులకు తిరిగి రుణాలు ఇవ్వాలని కోరారు. రైతు రుణమాఫీ ద్వారా వనపర్తి జిల్లాలో దాదాపు 400 కోట్లు  బ్యాంకు ఖాతాల్లో  జమ అయ్యాయని, వ్యవసాయ రుణాలు మాత్రం 10 శాతం దాటలేదని వాపోయారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3454.92 కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకోగా జూన్, 2024 వరకు కేవలం 324.92 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది.  యం.ఎస్.యం. ఈ,  ప్రయారిటీ సెక్టార్లు అయిన  విద్యా, గృహ నిర్మాణం తదితర రంగాల్లో 3961 కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకోగ  ఇచ్చింది  మాత్రం  386.28 కోట్లనీ అన్నారు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని, వ్యవసాయ రుణాలతో పాటు  నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రుణ సదుపాయం ఉన్న రంగాల పై యువతకు అవగాహన కల్పించాలని కోరారు.

రైతులు పంట రుణాలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు పెట్టకుండా రుణాలు ఇవ్వాలని సూచించారు.  కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని, ఇంతకు ముందు రుణాలు పొంది రుణమాఫీ జరిగిన తర్వాత తిరిగి రుణాలు అడిగితే అభ్యంతరాలు పెడుతున్నాయని కొంతమంది రైతులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.  అసైన్డ్ ల్యాండ్, లావుని పట్టా భూములకు రుణాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా కలక్టర్ అసైన్డ్ భూములు, లావుని పట్టాలు ఇచ్చింది ప్రభుత్వమే, ప్రభుత్వం  వాటిని తిరిగి తీసుకునేది ఉంటే నష్టపరిహారం చెల్లిస్తారు అలాంటప్పుడు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని బ్యాంకర్లను ప్రశ్నించారు.  అసైన్డ్ భూములు ఇంకొకరికి అమ్మడానికి వీలు లేదు కానీ వ్యవసాయ రుణం తీసుకోడానికి ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పారు. అదేవిధంగా రైతులు, మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకునేటప్పుడు డిపాజిట్ కింద లేదా సేవింగ్ కింద అగ్రిమెంట్ చేసుకోవడం సరికాదన్నారు. 

లబ్ధిదారులకు ముందు వివరించి చెప్పాలని, వారు సమ్మతం ఇస్తే తప్ప బలవంతంగా అగ్రిమెంట్ పై సంతకాలు తీసుకోవద్దని తెలియజేశారు. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో రైతు సభలు ఏర్పాటు చేయడం జరుగుచున్నాయని , అక్కడ బ్యాంకర్లు హాజరై రుణాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో   చాలా బ్యాంకులు డిపాజిట్లకు తగ్గ రుణాలు (సి.డి.రేషియో) పాటించడం లేదని అన్నారు.  సి.డి.రేషియో ఖచ్చితంగా పాటించాలని బ్యాంకర్లను సూచించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్, వనపర్తి  పట్టణంలోని సమీకృత మార్కెట్ సముదాయంలో కొత్తగా బ్యాంకులు, ఏ.టి యం నెలకొల్పాలని సూచించారు.  ఈ సమావేశంలో యల్.డి. ఒ రిజర్వ్ బ్యాంక్ రెహమాన్, నాబార్డ్ ఏ.జి.యం రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు, కొంతమంది రైతులు తదితరులు పాల్గొన్నారు.