కరీంనగర్లో టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు
భారీగా కల్తీ కారంపొడి, సుగంధ ద్రవ్యాల స్వాధీనం
కరీంనగర్ క్రైం, జూన్ 9 (విజయక్రాంతి): నగరంలోని శనివారం మార్కెట్ పరిధిలో కల్తీ కారంపొడి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. మార్కెట్లోని గౌరిశెట్టి రమేష్, సిద్ధంశెట్టి చక్రపాణి కిరాణం, సుగంధ ద్రవ్యాల దుకాణాల్లో సోదాల్లో నిర్వహించగా భారీ మొత్తంలో కల్తీ అనుమానిత నిల్వలను కనుగొన్నారు. 47 బస్తాల కారంపొడి, 2 బస్తాల పసుపు, 1 బస్తా ధనియాల పొడిని స్వాధీనం చేసుకున్నారు.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు దుకాణాల నుండి నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించారు. ఈ ల్యాబ్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు సదరు స్టాక్ను పూర్తిగా సీజ్ చేయడం జరిగిందని, ఈ సుగంధ ద్రవ్యాల అమ్మకాలపై పూర్తి నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్, ఎస్ఐలు సురేందర్, శ్రీకాంత్, కానిస్టేబుల్ సాయిదీప్ పాల్గొన్నారు.






