13-06-2025 08:59:17 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): పాఠశాలకు వచ్చేదే ఇద్దరు విద్యార్థులు.. ఆ ఇద్దరు ఈ ఏడాది బడికి రావడం మానేశారు. దీనితో రెండు రోజులుగా విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు ఏకాకిగా నిరీక్షిస్తున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెద్దమోరి తండా శివారు కొత్తూరులో వెలుగు చూసింది. గత విద్యా సంవత్సరం ముగింపు వరకు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చదువుతుండగా అందులో ఉమాదేవి నాలుగో తరగతి, సాత్విక్ మూడో తరగతి ముగించారు.
ఈ విద్యా సంవత్సరం గురువారం ప్రారంభం కాగా ఉమాదేవి ఐదో తరగతి, సాత్విక్ నాలుగో తరగతిలో చేరాల్సి ఉంది. అయితే గురువారం ఆ ఇద్దరు విద్యార్థులు పాఠశాలకు రాకుండా ముఖం చాటేశారు. విద్యార్థుల కోసం హెడ్మాస్టర్ వీరభద్రయ్య వారి ఇండ్లకు వెళ్లగా మేము హాస్టల్లో చేరుతామని, బడికి రామని చెప్పారు. రెండో రోజైనా మనసు మార్చుకొని పాఠశాలకు వస్తారని ఎదురు చూస్తున్న హెడ్మాస్టర్ కు నిరాశే ఎదురయ్యింది. శుక్రవారం కూడా పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో కొత్తూరు పాఠశాల ‘ 0 ’ అటెండెన్స్ గా నిలిచింది.