16-09-2025 01:05:22 AM
ఓఆర్ఆర్పై అదుపు తప్పిన కారు
మిగతా వారికి తీవ్ర గాయాలు
అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 15: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ సౌమ్య రెడ్డి (25) హైదరాబాదులో ఉంటూ ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తుంది.
ఆదివారం వీకెండు కావడంతో సౌమ్య రెడ్డి తన స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర (26) ప్రణీత్, సాగర్, అరవింద్, శృతిలతో కలసి ఇనోవా వాహనంలో యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలం పరిధిలోని సరళ మైసమ్మ దేవాలయానికి సందర్శన కోసం వెళ్లారు. అనంతరం తిరిగి ఇబ్రహీంపట్నం నుంచి ఘట్కేసర్ బయలు దేరే మార్గమధ్యలో బొంగులూరు ఎగ్జిట్ 10, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బలిజగూడ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం మితిమీరి వేగంతో ఉండడం వలన కారు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు పెద్ద అంబర్పేట్ ఎదురుగా ఉన్న రోడ్డు వైపునకు తిరిగింది. కారులో ప్రయాణిస్తున్న అందరికీ తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే వారిని హయత్నగర్లోని సన్ రైజు హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం సౌమ్య రెడ్డి, నందకిషోర్ లను ఉప్పల్ లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సౌమ్య రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ వి అశోక్ రెడ్డి తెలిపారు.