సాంకేతిక లోపం.. హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్
హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Rajiv Gandhi International Airport)లో మంగళవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో అత్యవసరంగా ఓ విమానం ల్యాండ్ అవ్వడంతో ప్రమాదం నుండి తృటిలో బయటపడింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం... తిరుపతికి వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్లైన్స్(Alliance Airlines) విమానం ఉదయం 67 మంది ప్రయాణికులతో శంషాబాద్ నుండి బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ యంత్రంలో సాంకేతిక సమస్య(Technical Glitch)ను గుర్తించాడు. పైలట్ వెంటనే మైదానంలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఏటీసీ.. అనుమతి ఇవ్వడంతో, విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించారు. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసి సురక్షితంగా కిందకు దిగింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ప్రయాణికులు మరొక విమానం ఏర్పాటు కోసం చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది.






