తహసీల్దార్లు బాధ్యతగా పనిచేయాలి
కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): తహసీల్దార్లు ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారులుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో భూభారతి, ప్రభుత్వ భూముల పరిరక్షణ, రెవిన్యూ అంశాలపై సమీక్షించారు. భూభారతి చట్టం కింద వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని,
తిరస్కరించిన దరఖాస్తులపై కారణాలు తెలియజేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడం తప్పనిసరని కలెక్టర్ స్పష్టం చేశారు. సాదా బై నామాలు, అసైన్డ్, భూదాన్ భూముల సమస్యల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పనులకు కావలసిన భూసేకరణ, మీసేవలో పెండింగ్లో ఉన్న సర్టిఫికెట్లను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇసుకను ఉచితంగా అందిస్తున్నందున సరఫరాలో సమన్వయం చేయాలన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బేసిక్కాల గ్రామ బస్తి దవఖానాలను సందర్శించి సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండి నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలన్నారు.
ప్రతి గ్రామంలో వైద్యులు తప్పనిసరి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు వారి వెంట జిల్లా వైద్యాధికారి రవికుమార్ ఉన్నారు. అంతకుముందు నాగర్ కర్నూల్ ఆర్డిఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ఓటరు జాబితాను పరిశీలించారు.






