30-09-2025 10:50:46 AM
హైదరాబాద్: తెలంగాణ పోలీసు అకాడమీలో డీజీపీ జితేందర్(Telangana DGP Jitender retires) పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ పోలీసుశాఖ ఫేర్వెల్ పరేడ్ నిర్వహించింది. డీజీపీ జితేందర్ వీడ్కోలు కార్యక్రమానికి కొత్త డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జితేందర్ డీజీపీగా 14 నెలల పాటు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ పై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికత సాయంతో అనేక నేరాలు ఛేదించామన్నారు. కొన్ని సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించామని సూచించారు. ఏ కష్టం వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త డీజీపీ శివధర్ రెడ్డికి వివిధ విభాగాల్లో చాలా అనుభవం ఉందని చెప్పిన జితేందర్ తన అనుభవంతో అద్భుతంగా విధులు నిర్వహిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. తనకు సహాయ, సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ జితేందర్ ధన్యవాదాలు తెలిపారు.