ఉప సర్పంచ్ ఎన్నికలో ఉద్రిక్తత
సీతారాంపురంలో ఎన్నికల అధికారిని గదిలో బంధించిన గ్రామస్థులు
సమాచారం ఇవ్వకుండా ప్రకటించారంటూ ఆరోపణ
కోదాడ, డిసెంబర్ 15: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికలు ఆలస్యం కావడంతో ఉప సర్పంచ్ ఎన్నికను ఆర్ఓ నాగరాజు సోమవారంకు వాయిదా వేసినట్లు తెలిపారు. సోమవారం ఎన్నికలో వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఉప సర్పంచ్ పేరు ప్రకటించారని పలువురు కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు ఆర్వోను నిలదీశారు.
ఈ క్రమంలో అధికారి బయటకు వెళ్లకుండా పంచాయతీ కార్యాలయం గేటుకి తాళం వేశారు. పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పారు. ఇదే విషయమై అధికారులు స్పందిస్తూ ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చి సమయం వరకు వేచి చూశామన్నారు. కానీ ఐదుగురు వార్డు మెంబర్లు మాత్రమే సమయానికి వచ్చారన్నారు.
కోరంకు సరిపడా రావడంతో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించి అతని పేరును ప్రకటించినట్లు తెలిపారు. ఇచ్చిన సమయం మించిన తర్వాత మిగిలిన ముగ్గురు వార్డు మెంబర్లు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఉపసర్పంచ్ ఎన్నిక జరిపారంటూ అభ్యంతరాలను వ్యక్తం చేశారన్నారు.






