30-01-2026 02:01:48 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం అసిఫాబాద్(విజయ క్రాంతి): పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి, బోధనా తీరు, విద్యా ప్రమాణాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువ వుండట గల కారణాలను ,ప్రధానోపాధ్యాయుని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి రప్పించాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రణాళికలు రూపొందించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం ఎలా అందిస్తునారని విద్యార్థులను ఆరా తీశారు. మెనూ ప్రకారం రుచికరమైన, పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను, రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన బోధన అందించాలని పేర్కొన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, వారిని మానసికంగా సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.