12-11-2025 01:35:34 PM
న్యూఢిల్లీ: పోలీసులు ఇటీవల వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించిన తర్వాత అరెస్టు చేసిన డాక్టర్ ముజమ్మిల్ గనై మొబైల్ ఫోన్ నుండి సేకరించిన డంప్ డేటాను విశ్లేషించినప్పుడు, ఈ ఏడాది జనవరిలో అతను ఎర్రకోట ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాది డాక్టర్ ముజమ్మిల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
గణతంత్ర దినోత్సవం నాడు చారిత్రాత్మక స్మారక చిహ్నాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు జరిగిన పెద్ద కుట్రలో భాగంగా ఈ దాడులు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ తీవ్రతరం కావడంతో వాటిని విఫలం చేశారని పోలీసులు వివరించారు. జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ లతో సంబంధాలున్న ఉగ్రవాద మాడ్యూల్ను పోలీసులు ఛేదించి, ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత, ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతం సమీపంలో నెమ్మదిగా కదులుతున్న కారుపై పేలుడు సంభవించిందన్నారు. ఈ దుర్ఘటనలో 12 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని అధికారులు వాపోయ్యారు.
జనవరిలోనే దేశ రాజధానిలో రెక్కీ నిర్వహించిన ఉగ్రమూక రిపబ్లిక్ డే టార్గెట్గా ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది. ఉగ్రవాదులు దాడులకు ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను టార్గెట్ చేశారు. దీపావళి రద్దీ సమయంలో దాడికి మరో ప్లాన్ చేసినట్లు తెలిసింది.భద్రతా కారణాల దృష్ట్యా చివరి నిమిషంలో ప్లాన్ రద్దు చేసుకున్నారు. ఉమర్ రషీద్, అమీర్ రషీద్ మరో రెండు కార్లు సమకూర్చుకున్నట్లు గుర్తింపు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి మరో వీడియోను అధికారులు బుధవారం నాడు గుర్తించారు.