15-11-2025 01:39:18 AM
ఢిల్లీ ఘటన నేపథ్యంలో ఆర్మీ చర్యలు
న్యూఢిల్లీ, నవంబర్ 14: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమైన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతాదళాలు పేల్చివేశాయి. జమ్మూకశ్మీర్లోని దక్షిణ పుల్వామాలో ఉన్న ఉమర్నబీ ఇంటిని శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ నేలమట్టం చేసింది. ఐఈడీ సాయంతో ఉమర్ ఇంటిని పేల్చివేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారికి ఇదో హెచ్చరికగా అధికారులు చెబుతున్నారు.
గతంలో కూడా పహల్గాం ఉగ్రదాడి కుట్రలో పాల్గొన్న వారి ఇళ్లను కూడా బుల్డోజర్లతో కూల్చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఉమర్ నబీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. హుండాయ్ ఐ20 కారుతో జరిపిన ఈ పేలుడులో 13 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎర్రకోట సమీపంలోని నేతాజీ సుభాష్ మార్గ్లోని ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పేలిపోయిన ఐ20 కారును ఉమర్నబీ నడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలంలో లభించిన, అతని తల్లి నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు సరిపోవడంతో కారులో ఉన్నది ఉమర్నబీనేనని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.