13-05-2025 12:36:24 AM
-మతాన్ని హింసకు వాడుకోవడం అటవీక సాంప్రదాయం
-ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం చూపాలి
-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హుజూర్ నగర్, మే 12: ప్రపంచంలో ఏ దేశంలోనైనా టెర్రరిస్టులను మట్టు పెట్టాల్సిందేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం హుజూర్ నగర్ లో సిపిఐ సీనియర్ నాయకుడు ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన స్వాతం త్య్ర సమరయోధురాలు, తెలంగాణ సాయుధ రైతాంగ వీరనారి పశ్య కన్నమ్మ సంతాప సభలో మాట్లాడుతూ కాశ్మీర్ లో అమాయకులను చంపి, అందులో కొత్తగా పెళ్లయిన జంటలోని నేవీ ఆఫీసర్ ను చంపడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
టెర్రరిస్టులు ఇప్పటివరకు ఎప్పుడైనా ఆకస్మికంగా కాల్పులు జరపడం వెళ్లిపోవడమే చూశామని మొదటిసారి మత ప్రాతిపదికన చంపడం జరిగిందన్నారు. దేశంలో జరుగుతున్న టెర్రరిస్ట్ దాడులపై ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. దేశంలో ఎన్నికలు జరిగినప్పుడే టెర్రరిస్టులు దాడులు జరపడం అమాయకులు బలి కావడం దానిని బిజెపి పార్టీ వాడుకోవడం అనుమానాలకు తావిస్తుంద న్నారు.
అమెరికా ఒకవైపు పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూనే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. టెర్రరిస్టులను అంతంమొం దించడం ప్రపంచ దేశాలన్నీ కలసి శాశ్వత పరిష్కారం వెతకాలి అన్నారు. పాకిస్తాన్లో ఉన్న ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదని అక్కడ కూడా టెర్రరిజాన్ని వ్యతిరేకించే సామాన్యమైన ప్రజలు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. తీవ్రవాద సమస్యకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేయడం బిజెపి ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుంది అని విమర్శించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండు ఒకే సంవత్సరం ఆవిర్భవించిన దేశం కోసం పోరాడిన చరిత్ర నిజమైన దేశభక్తి కమ్యూనిస్టులదే అన్నారు.దేశ రక్షణ, ప్రజా ప్రయోజనాల రక్షణకు సిపిఐ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. కార్యక్రమం లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,పశ్యపద్మ,అక్కినేని వనజ, భావం హేమంత రావు, జాతీయ మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి రజని, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, రైతాంగ పోరాట నాయకుడు దొడ్డ నారాయణరావు,గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.