13-05-2025 12:36:51 AM
ఫోన్లను బాధితులకు అందజేసిన క్రైమ్స్ డీసీపీ ఎల్సీ నాయక్
శేరిలింగంపల్లి, మే 12 : సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ ని తిరిగి బాధితులకు అందజేశారు సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు. గత 30 రోజులు శ్రమించి మొత్తం 310 ఫోన్లు రికవరీ చేసినట్లు క్రైమ్స్ డీసీపీ ఎల్.సి. నాయక్ తెలిపారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సిఈఐర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ. 95 లక్షలు ఉంటుందన్నారు.
అనంతరం రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్ అరెస్ట్,ఈజీ మనీ, షేర్స్ లలో పెట్టుబడుల పేరుతో ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు.
ఎటిఎం, బ్యాంకుఖాతాలు,సెంటిమెంట్స్,పర్సనల్ సమాచారం,ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు.సెల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు.సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మినా,కొన్నా చట్టపరంగా నేరమని తెలిపారు.ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్ పోలీస్ సిబ్బందిని డీసీపీ ఎల్.సి. నాయక్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, మాదాపూర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంజీవ్, శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజు,మేడ్చల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ దాలినాయుడు,సోషల్ మీడియా ఎస్ఐ శశిధర్ పాల్గొన్నారు.