26-06-2025 12:15:04 AM
డ్రైనేజీ ఆక్రమించే షెడ్డు నిర్మాణం
గొర్రెలు మేకల పెంపకంతో దుర్గంధం
ఫిర్యాదు చేసిన కథలని అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 25 ( విజయ క్రాంతి); దున్నపోతు ఈనందంటే... దొడ్లో కట్టేయండి అన్నట్లు ఉంది కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అధికా రుల పనితీరు. అధికారులకు పట్టదు... ప్రజలకు తప్పదు, మీ చావు మీరు చావండి మాకు కట్టే ఇంటి పన్ను క్రమం తప్పకుండా కట్టండి అన్నట్లు వ్యవహరిస్తున్నారు పాల్వంచ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. పట్టణ పరిధిలోని మార్కెట్ ఏరియా స్వాతి స్కూల్ లైన్ లో ఓ ఎన్ టి యజమాని ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజీని ఆక్రమించి షెడ్డు నిర్మించాడు.
అంతటితో ఆగకుండా ఆ షెడ్డులో మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రారంభించాడు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఇళ్ల మధ్య జీవరాసుల పెంపకంతో దు ర్గంధం వెదజల్లుతూ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఆ చుట్టుపక్కల ఇళ్లలో నివాసం ఉంటున్న కిరాయిదారులు ఆ దుర్గంధాన్ని భరించలేక ఖాళీ చేస్తున్నారు. సొంత ఇంటి యజమానులు ఇదేం కర్మ రా బాబు అంటూ ముక్కు మూసుకొని జీవిస్తున్నారు. ప్రజా ఆరోగ్యమే పరమావధిగా భావించే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
పరిసర ప్రాంతాల ప్రజలు పలుమార్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణ డ్రైనేజీపై నిర్మించిన షెడ్డును తొలగించి, గొర్రెలు ,మేకల పెంపకాన్ని, కటిక వ్యాపారాన్ని ఇండ్ల మధ్య నుంచి తొలగించాలని ఇంటి నెంబర్ 16-1-137, 16-1-139, 16-1-127, 16-1-128 ఇంటి యజమానులు పి సీతాలక్ష్మి, డే విజయ్ కుమార్, పి సైదమ్మ, ఎం శ్రీనివాస్ లు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.