జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను
నారాయణపేట. మార్చి, 30(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. నెలవారీ సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ నివారణకు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రామచందర్ నాయక్, ఆర్టీవో మేఘా గాంధీ, డీ.ఐ.ఈ.వో సుదర్శన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ జయసుధ, ఎస్.ఐ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.




