తెలంగాణలో బీసీ బావుట ఎగరేయాలి
బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
బీసీ ముఖ్యమంత్రి అయ్యేవరకు పోరాటం చేస్తాం
బీసీ పొలిటికల్ ఫ్రెండ్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్
ముషీరాబాద్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణలో బీసీ బాగుట ఎగురవేయాలని తెలంగాణ బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. శుక్రవారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్ అధ్యక్షతన దొడ్డి కొమరయ్య 99వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్లు అయి లి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరి శేఖర్ లతో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ అన్ని రంగాలలో బీసీలను పూర్తిగా అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మానప్రాణాలను దోచుకుని నాలుగువేల మంది నీ ఊచ కోత కోసి వారి మృతికి కారకుడైన కాశీం రాజ్విని ఫ్లైట్లో పాకిస్తాన్ కు పంపారని విమర్శించారు. త్యాగాలు మావి భోగాలు మీవా ఓట్లు మావి సీట్లు మీవా, శ్రమ మాది సంపద అగ్రకులాలదా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ ప్రతినిధులు బి. నాగభూషణం, హర్షవర్ధన్ గౌడ్, బాలగోని వెంక టేష్ గౌడ్, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




