15-06-2025 12:40:22 AM
విమాన ప్రమాద బాధితులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించిన ఆప్ నేతలు
ముషీరాబాద్ జూన్ 14 (విజయక్రాంతి): అహ్మదాబాద్లో విషాదకరమైన విమాన ప్రమాదంలో విలువైన ప్రాణాలను కోల్పోవడం ఎయిర్ ఇండియా తప్పిదమే అని, కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా, చైనా ఇప్పటికే బోయింగ్కు వీడ్కోలు చెప్పిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు విజయ్ మల్లంగి, బుర్ర రాము గౌడ్, డాక్టర్ అన్సారీ, అప్స సలాం, డాక్టర్ సోలొమన్ రాజ్ లు తెలిపారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రభుత్వ రంగ సంస్థ గా ఉన్న ఎయిర్ ఇండియా ను ప్రైవేట్ పరం చేయడంతో ఎయిర్ ఇండియాకు విమాన ప్రయా ణ చార్జీలు పెంపుపై ఉన్న శ్రద్ద ప్రయాణికుల భద్రతపై ఉండదని అన్నారు. ప్రయాణికుల ప్రాణాలు వారికీ ముఖ్యం కాదని, లాభాలే ముఖ్యమని వారన్నారు.
లోయర్ ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద శనివారం రాత్రి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి వారికీ ఘనంగా నివాళులు అర్పించారు. ప్రమాదంలో మరణించిన, వినాశకరంగా ప్రభా వితమైన అన్ని కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆప్ నేతలు మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ప్రయాణికులతోపాటు యువ వైద్య విద్యార్థులతో సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం హృదయాలను బద్దలు కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి ఎవరు జవాబుదారీ? డి.జి.సి.ఏ నా? ఎయిర్ ఇండియా నా ? భారత ప్రభుత్వం మా అని వారు ప్రశ్నించారు.
విమాన ప్రమాదానికి బాధ్యత వహించి కేంద్ర విమానాయన శాఖ మంత్రి ఎర్రం రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలనీ, విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి, మరొక ప్రమాదం జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు లక్ష్య నాయుడు, టి. రాకేష్ సింగ్, రాకేష్ రెడ్డి, రహమాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.