05-06-2025 12:58:15 AM
రంగారెడ్డి, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రాభివృద్ధిలో నిర్మాణరంగం వెన్నెముక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా నిర్మాణ రంగానికి తమ ప్రోత్సాహం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. బుధవారం గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్(జీఈబీఏ) యువజన విభాగం ఆధ్వర్యంలో నాగోల్లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
“గతేడాది కమర్షియల్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ 56 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది దేశంలోనే అత్యధికం. రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ను అద్దెకు తీసుకున్నారు. ఇవి కేవలం అంకెలు కాదు, పెట్టుబడిదారుల్లో తెలంగాణపై ఉన్న విశ్వాసాన్ని చాటి చెపుతున్నాయి’ అని అన్నారు. “రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వాటా సుమారు 30 శాతం వరకు ఉంది.
నిర్మాణ రంగంలో సుమారు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. ఉక్కు, సిమెంట్, ఇంటీరియర్ తదితర పరిశ్రమలకు కూడా ఈ రంగం ఊతమిస్తోంది” అని వివరించారు. “రియల్ ఎస్టేట్ ప్రత్యక్షంగా.. పరోక్షంగా అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని వృద్ధిపైనే ఇతర రంగాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 2014 నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్లో దూసుకెళ్తోంది.
మన దగ్గర నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామికవేతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం రెరా దగ్గర 9,679 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, 4,252 మంది ఏజెంట్లు నమోదు చేసుకున్నారు” అని పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు.
పర్యావరణహితంగా నిర్మాణాలు జరిపేందుకు యువ బిల్డర్లే చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జీఈబీఏ యువజన విభాగం ప్రతినిధులు విక్రమ్కుమార్, మేఘన, అక్షయ్, మహేష్ పాల్గొన్నారు.