తండాల అభివృద్ధే నా ధ్యేయం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, మార్చి 16: తండాలలో నివసించే గిరిజనుల సంక్షేమం, వారి ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. సోమవారం ఫరూక్ నగర్ మండలం మొండోని రాయి తండాలో నూతన రేషన్ షాపును ఆయన ప్రారంభించారు. స్థానిక గిరిజన నేత సూర్య నాయక్ విన్నపం మేరకు, రేషన్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న తండా వాసుల కోసం వెంటనే రేషన్ షాపును మంజూరు చేయించినట్లు వెల్లడించారు.
గిరిజన శుభకార్యాల కోసం షాద్ నగర్ పట్టణంలో ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.ఇందిరా గాంధీ హయాం నుండి నేటి వరకు గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, గత పదేళ్లలో జరగని అభివృద్ధిని ఈ రెండేళ్లలోనే చేసి చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గిరిజన సంప్రదాయాలు, పండుగలు వారి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నానని పేర్కొన్నారు.రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, నిరుపేదల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, బ్లాక్ స్థాయి నేతలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




