ధూల్పేట్లో గంజాయి నివారణే లక్ష్యం
ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ధూల్పేట్లో గంజాయి నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ పేర్కొన్నారు. ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా సోమవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, సివిల్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి డాన్గా పిలువబడే అంగూర్భాయ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు ఇద్దరు కీలక గంజాయి సరఫరాదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
గంజాయి అమ్మకాలు ఆపకపోతే కేసులతో పాటు ఆస్తుల జప్తునకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, సౌత్వెస్ట్ డీసీపీ చంద్రమోహన్ హెచ్చరించారు. ఆపరేషన్లో అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్రెడ్డి, గోషామహల్ ఏసీపీ వెంకట్రెడ్డి, ధూల్పేట్ ఇన్చార్జ్ ఎక్సైజ్ ఈఎస్ అంజిరెడ్డి పాల్గొన్నారు.






