calender_icon.png 10 October, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టుకెళ్లాలి

10-10-2025 01:51:46 AM

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్య త వహించాల్సి ఉంటుందని తెలిపారు. గురువారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్ల విషయం లో చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడ వల్లే ఈ రోజు బీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణం.

బీసీలకు న్యాయం జరిగేలా వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన లొసుగులను సరిచేసుకోవాలి. ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపినప్పటికీ, గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోంది.

ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించి చట్టపరమైన లొసుగులను సరిదిద్దుకోవాలి. ప్రతీ అం శాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని అడ్డుకుంటోందని దుష్ర్పచారం చేస్తున్నారు. ఈ రాష్ర్ట ప్రభుత్వానికి చట్టపరమైన అవగాహన లే దా? లేక ఆలోచనలో స్పష్టత లేదా?. బీజేపీ  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు ఇస్తూ దానికి కట్టుబడి ఉంది.

మధ్యప్రదేశ్‌లో 57 శాతం రిజర్వేషన్ల కోసం బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కేవలం ఓట్ల కోసం, రాజకీయ స్వలాభం కోసం బీసీలకు అన్యాయం చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలే లేదు. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసింది కాంగ్రెస్‌కు చెందినవారే.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

‘యూటర్న్’ రాజకీయం 

కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని తన మోసపూరిత ప్రయోగంగా మార్చుకుంది. 2009 డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించి, వెంట నే యూటర్న్ తీసుకోవడం వల్ల 9 సంవత్సరాలు ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున ప్రమాణం చేయాలన్న రేవంత్‌రెడ్డి వాగ్దానం, కానీ మళ్లీ వెనక్కు తగ్గాడు. జీవో నెం 9 తో ‘బీసీ సాధికారత’ అని చెప్పి ముస్లింలను చేర్చే ప్రయత్నించింది. కాంగ్రెస్ తెలంగాణను రాజకీయ లాభాల కోసం వంచించింది. 

           కేంద్ర మంత్రి బండి సంజయ్

కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనం 

తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడం కాంగ్రెస్ ప్ర భుత్వ చేతగానితనానికి నిదర్శనం. బీసీలను సీఎం రేవంత్‌రెడ్డి నిలువునా మోసం చేశా రు. పరిపాలన చేతగాక డ్రామాలు ఆడటం అలవాటు అయిపోయింది. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అం శాన్ని తెరమీదకు తెచ్చారు. రాజ్యాంగ సవరణ లేకుండా 50 శాతానికి మించి రిజర్వే షన్లు ఎలా నిలబడతాయి. బీసీలపై రెడ్డికి చిత్తశుద్ధి లేదని అందుకే ఈ డ్రామా. 

 బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

ఇతర పార్టీలపై బురదజల్లే ప్రయత్నం

కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుపై చిత్తశుద్ధి లేదు. దీనికి హైకోర్టు స్టే ఇవ్వడమే నిదర్శనం. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అసెంబ్లీలో చెప్పా. అదే ఇప్పుడు జరిగింది. బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు పలికి సూచనలు చేసినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. 42 శాతం పేరిట కాంగ్రెస్ బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే, జీవో జారీ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసిన కుటిల నీతి బయట పండింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ఇతర పార్టీలపై బురదజల్లే ప్రయత్నం చేసి, రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే.

 పాయల్ శంకర్  బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత