ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, మే 29 (విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం చివ్వెంల మండలం వలభాపురం లోని జగన్మాత పారా బాయిల్ రైస్ ఇండస్ట్రీలో ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఆన్ లోడింగ్ చేయాలని, మిల్లర్లు ధాన్యం దిగుమతిలో జాప్యం చేయకూడదని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయన వెంట చివ్వెంల తహసిల్దార్ చంద్రశేఖర్, రైస్ మిల్ యజమాని జగన్ తదితరులు పాల్గొన్నారు.






