1 April, 2026 | 2:36 AM

రమణీయం.. రాములోరి రథోత్సవం

01-04-2026 12:00 AM

-జై శ్రీరాం నినాదాలతో మార్మోగిన శిర్సనగండ్ల క్షేత్రం 

చారకొండ మార్చి 31: అపర భద్రాద్రిగా పిలిచే నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున అత్యంత రమణీయంగా జరిగింది. వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. శిర్సనగండ్ల గుట్ట భక్తజన సంద్రంగా మారగా జైశ్రీరాం నినాదాలతో మార్మోగింది.

భక్తుల జయ జయ ధ్వానాలు, హర్షాతిరేకాల మధ్య ఈ ఘట్టం దాదాపు 2 గంటల పాటు సాగింది. రకరకాల పూలతో అలకరించిన పెద్ద రథానికి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలు చేసి ప్రారంభించారు. డప్పు, వాయిద్యాల నడుమ, భక్తుల జైశ్రీరాం నామస్మరణల మధ్య రథాన్ని ముందుకు కదిలించారు. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ప్రారంభమైన రథోత్సవం 6.45 గంటలకు ముగిసింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. భారీ స్థాయిలో హాజరు కావడంతో గుట్టపై ఉన్న ఇళ్లపై నుంచి రధోత్సవాన్ని భక్తులు కన్నులారా వీక్షించారు.

చాలా మంది భక్తులు సోమవారం రాత్రే శిర్సనగండ్ల గుట్టపైకి చేరుకుని అక్కడే జాగరణ చేశారు. రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్త్స్ర వీరబాబు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. గుట్టపైకి వాహనాలు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈవో ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, సర్పంచి రామస్వామి, ఉప సర్పంచి కళ్లు సురేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, సందీప్ రెడ్డి, రమేష్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.