27-06-2025 01:19:48 AM
- పదేళ్ల నుంచి పని చేసిన దొరకని భద్రత
- రోడ్డున పడ్డ వెయ్యి కుటుంబాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్2౬ ( విజ యక్రాంతి):ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి రాష్ట్రంలో 2012 వరకు కాంట్రాక్టు వ్యవస్థలో అధ్యాపకులను తీసుకోగా ఆ తర్వాత కాంట్రాక్టు వ్యవస్థలో తీసుకోవడం ఆపివేసి అతిధి అధ్యాపకులంటూ పీరియడ్ వ్యవస్థను 2013లో అప్పటి ప్రభుత్వం తీసుకురాగా కళాశాలలో పదవీవిరమణ, పదో న్నతులతో ఖాళీలను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా గత సంవత్సరం ప్రభుత్వం ఏకబిగిన ప్రభుత్వ కళాశాలలో 1254 జూనియర్ అధ్యాపక పోస్టులు భర్తీ చేయడంతో రాష్ట్రంలో 2013 నుండి అతిథి అధ్యాపకులగా పనిచేస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుస్థితి దాపరించింది.
రాష్ట్రంలో మొత్తం 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రస్తుతం కొనసాగుతుం డగా వీటిలో 1654 మంది అతిథి అధ్యాపకులుగా గత సంవత్సరం వరకు కొనసాగారు. గత సంవత్సరం జూనియర్ అధ్యాపకుల భర్తీ ప్రక్రియలో 1250 అధ్యాపకులను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో వోకేషనల్ గ్రూపులలో పనిచేస్తున్న 350 జనరల్ గ్రూపుల్లో పనిచేస్తు న్న 150 మంది అతిథి అధ్యాపకులు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా మిగిలారు. దీంతోపాటు ప్రస్తుత సంవత్సరం 20 జూనియర్ కళాశాల అదనంగా రాగా వాటిలో మరో 200 మంది వరకు చోటు దొరికే అవకాశం ఉంది. వీరంతా పోను ఇంకా 1000 మంది అతిథి అధ్యాపకులు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
పదేళ్ల నుంచి దొరకని భద్రత
ప్రభుత్వ కళాశాల అభివృద్ధి కోసం పీరియ డ్ల ప్రాతిపదికన గరిష్టంగా నెలకు రూ. 28,080 వేతనాలతో గత 12 సంవత్సరాలు గా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోగా ప్రస్తుతం వ్యవస్థలో నుంచి తమను వెలగొట్ట డం తీరని అన్యాయం చేయడమే అవుతుంద ని అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.12 సంవత్సరాల నుండి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం కోసం కృషి చేస్తున్న తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అమలు కానీ వైనం:-
2023లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1654 మంది అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు, 12 నెల లు 42,000 జీతం అందిస్తామని ప్రకటించిం ది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అతిధి ఆధ్యాపకులు వారి కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేయగా అది మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలింది.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గతంలో పెండింగ్లో ఉన్న జేఎల్ నోటిఫికేషన్లో భాగం గా పరీక్ష నిర్వహించి అధ్యాపకులను భర్తీ చేయడం అతిథి అధ్యాపకులు రోడ్డున పడటం క్షణాల మీద జరిగిపోయాయి. ప్రస్తుతం అటు మంత్రులుగాని ఇటు కమిషనర్ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో తమ పరిస్థితి ఏంటని అతిథి ఆధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.
వింత సమాధానాలు:-
అతిథి అధ్యాపకులు తమ సమస్యకు సం బంధించి కొలువులు కోల్పోయిన వారిని ఇత ర చోట్ల భర్తీ చేయడానికి వివిధ రకాల మం త్రులను కలవగా వారు అతిథి అధ్యాపకులను కాపాడుకుంటామని అండగా ఉంటామని చెబుతున్నారు. కమిషనర్ స్థాయి అధికారులు కూడా ఇదే సమాధానం వెల్లడి చేస్తున్నప్పటికీ కళాశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తు న్న కనీసం తమ గురించి ఎటువంటి నిర్ణయం లేకపోవడంపై త్రిశంకు స్వర్గంలో అతిథి అధ్యాపకులు కొట్టుమిట్టాడుతున్నారు.
ఇలా చేస్తే కొంత మేలు
రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు అధికంగా ఉన్నారు వీటిలో అదనంగా ఒక్కొక్క పోస్టు పెంచినట్లయితే అతిధి ఆధ్యాపకులకు కొంత మేలు జరుగుతుంది. అలాగే పలు కళాశాలలో గత రెండు సంవత్సరాల నుండి ఆంగ్ల మాధ్యమం కూడా క్లాసులు కొనసాగుతున్నాయి. వాటికి ప్రత్యేకంగా పోస్టు లు మంజూరు చేస్తే అతిథి ఆధ్యాపకులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు ఈ దిశగా ఆలోచిం చి తమకు తిరిగి ఉపాధి కల్పించాలని అతిథి అధ్యాపకులు కోరుతున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అతిధి ఆధ్యాపకుల విషయంలో ఇచ్చిన హామీ నెరవేరుస్తుందా లేదా తుంగలో తొక్కుతుందా ఏం చేస్తుందనేది వేచి చూడాలి.
ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డాం..
ప్రభుత్వ నూతన అధ్యాపకుల నియామకంతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కుటుంబా లు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నూతన అధ్యాపకులను భర్తీ చేసిన చోట డిస్టర్బ్ అయినవారిని, ఎక్కువగా స్ట్రెంత్ ఉన్నచోట రెండవ పోస్ట్ సృ ష్టించి భర్తీ చేయాలని కోరుతున్నాం.ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం.
శ్రీనివాస్, అతిథి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు