calender_icon.png 26 June, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కన్నప్ప’ ప్రయాణం వ్యక్తిలా నన్ను చాలా మార్చింది

09-06-2025 02:27:18 AM

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజాచిత్రం ‘కన్నప్ప’. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, ముఖేశ్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రల్లో నటించారు. 

ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైనర్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీటీమ్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌నను గుంటూరులో నిర్వహించింది. ఈ వేడుకలో హీరో విష్ణు మంచు మాట్లాడుతూ.. “ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలనేది శివాజ్ఞతోనే జరిగింది.

ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ప్రభాస్‌కు లేదు. కానీ ఆయన మా నాన్న మీదున్న గౌరవం, ప్రేమతోనే చేశారు. దేవుడు నిజంగానే ఉన్నాడా? అనే సందేహం కలిగినప్పట్నుంచే భక్తి పుడుతుంది. దేవుడికి దాసోహం అవుతాం. ‘కన్నప్ప’ సినిమా కూడా అంతే. ఈ ప్రయాణం నన్నొక వ్యక్తిలా చాలా మార్చింది” అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ.. “మా అమ్మకు పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కాదు.

అందరూ నా వాయిస్‌ను మెచ్చుకుంటుంటే ఆ మాటలు మా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేదని అనుకునేవాణ్ని. జీవితంలో భయం అనేది ఉండకూడదు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూడదు. కన్నప్ప సినిమాను ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. దాదాపు ఏడెనిమిదేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం. నా బిడ్డ ఎంత కష్టపడ్డాడనేది నేను చెప్పదలుచుకోలేదు. సినిమానే మాట్లాడుతుంది. ప్రభాస్ నాకంటే చిన్నవాడు.

కానీ మేమిద్దరం బావా.. అనే పిలుచుకుంటాం. మా మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. సినిమాలో నటించాలని కోరిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన వందేళ్లు క్షేమంగా ఉండాలి. మోహన్‌లాల్ దేశం గర్వించదగ్గ నటుడు.

ఈ సినిమాలో భాగమైన అందరినీ ఆ భగవంతుడే రప్పించాడు” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, రఘుబాబు, శివబాలాజీ, బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ మాట్లాడి ఈ సినిమా జర్నీలో తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.