ప్రజల విశ్వాసమే మా బలం
- బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం
- టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న
- ఆలేరు, భువనగిరి, వనపర్తి నుంచి పార్టీలో భారీగా చేరికలు
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ప్రజల విశ్వాసమే తమ పార్టీకి బలమని టీఆ ర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆలేరు, భువనగిరి, వనపర్తి ప్రాంతాల నుంచి పలువురు పార్టీలో చేరారు. భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ముఖ్య అనుచరుడు ఎండీ గౌస్ తన అనుచరులతో కలిసి, వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం మనోహర్గౌడ్ టీఆర్పీలో చేరారు.
వీరికి తీన్మార్ మల్లన్న పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎ స్ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. బీసీల కు రాజకీయ, ఆర్థిక, సామాజిక, రాజ్యాధికా రం కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టంచేశారు. బీసీల హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం, సామాజిక న్యాయం కోసం టీఆర్పీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో మార్పు కోరుకునే ప్రజలు టీఆర్పీ వైపు అడుగులు వేస్తున్నారని, గ్రామం గ్రామాన పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ చేరికలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నర్సింహులు, బొమ్మలరామారం మండల అధ్యక్షుడు శ్రీనాథ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోజన్నాయక్, ఆలేరు మండల అధ్యక్షుడు చింతపండు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






