06-06-2025 01:15:50 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూన్ 5(విజయక్రాంతి): సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ బడిబాట కార్యక్రమంపై కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం నాడు బడిబాట కార్యక్రమం పై పంచాయతీ సెక్రెటరీ, ఉపాధ్యాయుల సమన్వయంతో గ్రామసభలు నిర్వహించి తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్య ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని, అలాగే అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు ఈ గ్రామసభలో పాలు పంచుకునేలా చూడాలన్నారు.
ప్రతి బాల, బాలికలు పాఠశాలలో అడ్మిషన్ పొందేలా ప్రత్యేక శ్రద్దతో బడిబాట నిర్వహించాలని, జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో బాల బాలికల విద్యార్థిణుల డ్రాప్ ఔట్ నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో బాలికల నమోదు శాతం పెంపొందించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో మరుగుదొడ్లు వినియోగంలో ఉండాలన్నారు.
బాలికలు పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేల వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 8 నుంచి జూన్ 10 వరకు 3 రోజులపాటు ఇంటింటికి తిరిగి పిల్లలందరూ పాఠశాలలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించి ప్రతి గ్రామంలో గ్రామ రిజిస్టర్లు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, ఇంటర్మీడియట్ అధికారి మాధవి,, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారులు తదితరులుపాల్గొన్నారు.