27-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా పనితీరును కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక బృందం కొనియాడింది. బుధవారం ఈ బృందం నగరంలోని పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, హైడ్రా సాధించిన ఫలితాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెంగళూరు మాజీ మేయర్, చెరువుల పునరుద్ధరణ నిపుణులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాంకేతిక నిపుణులు, కాంట్రాక్టర్లతో కూడిన ఈ బృందం నగరంలో పర్యటించింది.
నగరంలోని బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్ల చెరువులను కర్ణాటక బృందం సందర్శించింది.బతుకమ్మకుంట పరివర్తనను చూసి వారు అబ్బురపడ్డారు. ఒకప్పుడు ఆక్రమణలకు గురై, ముళ్ల పొదలతో నిండిపోయిన ఈ ప్రాం తం.. నేడు నయనమనోహరమైన జలాశయంగా మారడం అద్భుతమని వారు అభివర్ణించారు. ఆక్రమణలను తొలగించి, ఏకం గా అక్కడ ఒక చెరువును సృష్టించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
చెరువుల పునరుద్ధరణ వల్ల కలిగిన లాభాలను స్థానికులు కర్ణాటక బృందానికి వివరించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కర్ణాటక బృందం హైడ్రా కార్యాల యంలో కమిషనర్ ఏవీ రంగనాథ్తో సమావేశమైంది. చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ లో ఎదురైన సవాళ్లు, ఆక్రమణదారుల నుం చి వచ్చిన ఒత్తిళ్లు, న్యాయపరమైన చిక్కులను అధిగమించిన తీరును అడిగి తెలు సుకున్నారు.
హైడ్రా అనుసరించిన వ్యూహా లు ఇతర నగరాలకు ఆదర్శమని వారు పేర్కొన్నారు. కాగా గతంలో చెరువుల పునరుద్ధరణ పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు హైడ్రా బృందం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించిన విషయం తెలిసిందే.