నిశిరాత్రి ఇసుక ‘మాఫియా’
రాత్రి అయిందంటే చాలు అడవి నుండి తరలుతున్న ఇసుక మాఫియా
అటవీ శాఖ అధికారుల కనుసైగల్లో సాగుతున్న ఇసుక దందా
మామూళ్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు
దర్జాగా ప్రో క్లీనర్ పెట్టి, ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్న మాఫియా
సదాశివనగర్, మార్చ్ 11 (విజయక్రాంతి): మట్టి, మొరం మాఫియా ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. పొద్దస్తమానం రాత్రి వేళలో సైతం మాఫియా దర్జాగా ఇసుక, మొరం తరలిస్తున్నారు. పెద్ద పెద్ద గుట్టలు, చెట్లు కూడా మాఫియా ఆగడాలతో కరిగిపోతున్నాయి. ఇసుక, మొరం మాఫియా ఆగడాలు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో కొనసాగుతున్నాయి.
అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం కొందరు మామూళ్లకు అలవాటు పడి సహకరిస్తున్నారు. దీంతో దర్జాగా దంధా ను కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ఇసుక, మొరం దందా లు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. గుట్టలు, అడవులను సైతం వదలడం లేదు. సదాశివనగర్ మండలం కల్వరాలు అటవీ ప్రాంతం నుండి రాత్రి వేళల్లో ఇసుకను, మొరమును పో క్లీనర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా రోజు ఇసుక మాఫియా తరలిస్తున్నారు.
మండలంలోని ధర్మరావుపేట్ ముడేగాం,బొంపల్లి, పద్మాజీవాడి ,కల్వరాల్,సదాశివ నగర్, తిర్మన్ పల్లి, మర్కల్ తదితర గ్రామాలకు రాత్రి సమయంలో ఇసుక రవాణా జరుపుతున్నారు. కొందరు ట్రాక్టర్, పోకిలైనర్ ల యజమానులు అడవి శాఖ అధికారులతో కుమ్మక్కై వ్యవహారం సాఫీగా నడిపిస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు, ఇతర ఇళ్లకు ఐదు వేల నుంచి 6000 రూపాయలు తీసుకొని ఇసుక, మొరం దందా కొనసాగిస్తున్నారు. బేస్మెంట్ లెవల్లో ఇసుక, మొరం నింపాల్సి ఉండడంతో మాఫియాకు కలిసి వస్తుంది.
ఇసుక, మొరం అటవీ నుంచి తరలిస్తున్న అటవీ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇసుక తరలించడం వాళ్ళ భూగర్భ జలాలు ఇంకిపోయి అడవిలో వృక్ష సంపద కోల్పోయే ప్రమాదం ఉందని అటవీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఇసుక, మొరం దందా లకు బ్రేక్ వేయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ లను కూడా ఎగ్గొడ్తూ అధికారులకు మామూళ్లు కట్టబెట్టి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.




