ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయి
హనుమకొండ, జూలై 13 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్2026) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండలోని వికాస్నగర్, సమ్మయ్యనగర్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్, పెండింగ్ వివరాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. మొబైల్ యాప్ ద్వారా బీఎల్ఓలు నిర్వహిస్తున్న డిజిటలైజేషన్ విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
డేటా నమోదు, ఫారాల అప్లోడ్, వివరాల ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు.జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బీఎల్ఓలకు పూర్తి సహకారం అందిస్తూ ప్రతి అర్హ ఓటరిని గుర్తించాలని, ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
డిజిటలైజేషన్ పురోగతి తక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి ప్రతిరోజూ సమీక్షించాలని ఆదేశించారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని వినియోగించి నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా విస్తృత చర్యలు చేపట్టాలని, పంపిణీ చేసిన ఫారాలను పూర్తి వివరాలతో నింపి ఈ నెల 14 లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, అందిన ఎన్యూమరేషన్ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా సమగ్రంగా ఎన్యూమరేషన్ నిర్వహించడం ప్రతి అధికారి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) శ్రీనివాస్, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.






