కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి సరఫరా పెంచాలి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి మార్చి 23 : కల్వకుర్తి నియోజకవర్గ రైతులకు సాగునీటిని సమృద్ధిగా అందించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వాన్ని కోరారు. కాలువలపై ఆధారపడి వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసిన రైతులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత 15 రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వనపర్తి వైపు అధికంగా నీరు వెళ్తున్నట్లు సమాచారమని 29వ ప్యాకేజీ కాల్వ ద్వారా నీటి సరఫరా పంపించాలన్నారు.
చేతికొచ్చే దశలో పంటలు ఉండటంతో కాలువలు పూర్తిగా ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.పంటలు చేతికి వచ్చే వరకు నిరంతరంగా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులకు తక్షణం ఆదేశాలు ఇచ్చి నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.




