16-12-2025 01:26:37 AM
మా ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా: మధు కృష్ణ
శామీర్పేట్, డిసెంబర్15 (విజయ క్రాంతి): లక్ష్మాపూర్ పెద్ద చెరువుకు కెమికల్ గండం పట్టుకుంది. చెరువులో జినోమ్ వ్యాలీ ఫేస్ 2 (కర్కపట్ల) గల కంపెనీల నుంచి వస్తున్న కాలుష్య వ్యర్థాలు కలుస్తున్నాయి. దీంతో చెరువులో మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందే చేపలు మృత్యువాత పడుతున్నాయి. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల్లో లక్ష్మాపూర్ పెద్దచెరువు ప్రధానమైంది.
దాదాపు 116 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఆయకట్టు కింద సుమారు 400 ఎకరాల పంట సాగు చేసుకుని రైతులు జీవిస్తుంటారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన చెరువును ఇప్పుడు ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ జలాల కాటుకు బలైపోతుంది. లక్ష్మాపూర్ గ్రామానికి పక్కనే ఉన్న కర్కపట్ల గ్రామ సమీపంలో ప్రభుత్వం పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసింది. పరిశ్రమలను స్థాపించిన యాజమాన్యాలు నిబంధనలు గాలికి వదిలేయడంతో అసలు సమస్య మొదలైంది.
ఈ పారిశ్రామిక కంపెనీలు పైకి అద్దాలమేడలా కనిపించినా కాలకూట విషాన్నివదలుతున్నాయి. నిబంధనలు గాలికి వదిలేసిన కంపెనీల యజమాన్యాలు యథేచ్ఛగా కలుషిత నీటిని లింగాల కుంటలోకి వదలగా అది నిండి వానాకాలంలో లక్ష్మాపూర్ పెద్ద చెరువులో కలుస్తున్నాయి. కాలుష్య నీరు గ్రామస్థులను అతలాకుతలం చేస్తోంది. కలుషిత నీటితో మత్సకారులు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు.
అంతేకాదు చెరువుకు ఆనుకొని బోరుబావి వేసి దానిలోనుండే గ్రామ ప్రజలకు నీరును అందిస్తున్నారు. ఆ నీరు తాగి అనారోగ్య పాలవుతున్నారని. లక్ష్మాపూర్ గ్రామ యువ నాయకుడు క్యాతం మధు కృష్ణ లక్ష్మాపూర్ గ్రామానికి కాపాడాలని సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారిలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.