04-08-2025 12:00:00 AM
- 56 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన పలువురు
- తెలంగాణకు శ్రీరామ రక్ష.. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే..!
- కాంగ్రెస్ పార్టీకి ద్రోహాలు చేయడం కొత్తేమీ కాదు..
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయ కులు ఇతర పార్టీలో చేరగా తాజాగా నేరడిగొండ మండలంలోని కిష్టపూర్ గ్రామానికి చెందిన న్యాల్ చౌహన్ 56 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాగా ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఆయనతో పాటు పలువురు బీఆ ర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా న్యాల్ చౌహన్ మాట్లాడుతూ.. 56 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని పార్టీ అభివృద్ధికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని కానీ ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ని సీఎం చేయడంతో ఆయన సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వట్లేదన్నారు. ప్రజా పాలన పేరుతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేయడాన్ని చూసే పార్టీ మారాలని నిర్ణయిం చుకొని ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సమక్షంలో రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు.
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన శ్రీరామ రక్ష అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహాలు చేయడం కొత్త కాదని అన్నారు. మోసపూరిత వాగ్దానాలను చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గీత కరణ్, గులాబ్, మదన్ తదితరులు ఉన్నారు.