సమయానికి రారు..
- విద్యుత్ శాఖ ములుగు సీఎస్సీ సిబ్బంది తీరు
- వినియోగదారులకు తప్పని ఎదురుచూపులు
గజ్వేల్ లో ఆగస్టు 18: ములుగు మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ సి ఎస్ సి ( వినియోగదారుల సేవా కేంద్రం)లో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. వినియోగదారుల సేవా కేంద్రంలో సేవలందించే ఆర్టిజన్ సెలవు పై వెళ్లారు. కాగా సేవా కేంద్రంలో ఉదయం10.30 గంటలకు హాజరు కావాల్సిన కంప్యూటర్ ఆపరేటర్ అరగంట ఆలస్యంగా విధులకు హాజరైంది. సేవా కేంద్రం నిర్వాహకులతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
వివిధ గ్రామాల నుంచి వినియోగదారుల సేవా కేంద్రానికి పలు విద్యుత్ సేవల కోసం వచ్చిన రైతులు, ఇతర వినియోగదారులు చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. వారి ఇబ్బందిని పరిశీలించిన అక్కడి సబ్ స్టేషన్ ఆపరేటర్ సేవలు పొందడానికి అవసరమైన సలహాలు సూచనలు చేశాడు. కాగా కంప్యూటర్ ఆపరేటర్ ప్రతిరోజు అరగంట ఆలస్యంగానే వస్తుందని పలువురు చెప్పడం, ఆలస్యంగా విధులకు హాజరయ్యే సిబ్బందిపై అధికారులు, నిర్వాహకులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.






