17-12-2025 08:24:02 AM
హైదరాబాద్: తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగగా, ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లోని 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీపడగా, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 36,425 వార్డులకు గాను 7,908 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 11 గ్రామ పంచాయతీల్లో, 116 వార్డులో నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరో రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.