15-06-2025 01:30:00 AM
నిజాం నవాబుల కాలంలో భూస్వాముల పెత్తందారీతనానికి భిన్నంగా, ప్రజలతో మమేకమై పరిపాలన సాగించిన అరుదైన విశ్వబ్రాహ్మణ దొరల కథ ఇది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలోని అవుసులోళ్ల (స్వర్ణకారుల) గడీలు ఇందుకు సజీవ సాక్ష్యాలు. తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన గాథ ఈ గ్రామానిది. నిజాం పాలనలో విశ్వబ్రాహ్మణులు దొరలుగా వెలుగొందిన అపురూపమైన కథ. వృత్తి కళాకారులైన వీరు పాలకులుగా ఎదిగిన తీరు, ఆనాటి వైభవాన్ని చాటే గడీలు నేటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న గట్లమల్యాల ఒకప్పుడు విశ్వబ్రాహ్మణుల దొరతనానికి ప్రతీకగా నిలిచింది. కంసాలి, అవుసలి, స్వర్ణకారుల కులాలకు చెందిన వారు ఇక్కడ పాలకులుగా వ్యవహరించారు. వారి పాలనకు గుర్తుగా సుమారు ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న గడీ నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గడీని కత్తూరిపల్లి సత్యనారాయణరావు నిర్మించారు. గ్రామస్తులు ఈ గడీని దొరలమల్యాల గడీ, అవుసులోళ్ల గడీ అని పిలుచుకుంటారు. తెలంగాణలో మరెక్కడా కనిపించని విధంగా వృత్తి కళాకారులు పాలకులుగా ఎదగడం, సొంతంగా గడీలు నిర్మించుకోవడం ఇక్కడ ప్రత్యేకత.
భూస్వాములుగా..
తెలంగాణ నిజాం పాలన అంటే వెలమలు, దేశ్ముఖ్లు, రెడ్ల పెత్తనం ఉండేది. ఈ మూసను బద్దలు కొడుతూ గట్లమల్యాలలో అవుసులోళ్లు తమదైన శైలిలో పాలన సాగించారు. గ్రామంలో నేటికీ నిలిచి ఉన్న వీరి గడీలు ఆనాటి రాజ దర్పాన్ని చాటుతున్నాయి. ఇతర భూస్వాముల వలె కాకుండా.. ఈ దొరలు తమ గడీల్లో ఉన్నప్పటికీ ప్రజలతో కలిసి వ్యవసాయం చేసేవారు. కాలానుగుణంగా భూముల విలువ పెరిగినా, తమ కింద పనిచేసే వారికి వాటిని తక్కువ ధరకే విక్రయించడం వారి విశాల హృదయానికి నిదర్శనం. ఈ గడీని కత్తూరిపల్లి సత్యనారాయణ నిర్మించారని చరిత్ర చెబుతున్నది.
ప్రజా సేవలో దొరలు
నడిపిదొర యాదగిరిరావు గట్లమల్యాల సర్పంచిగా పనిచేశారు. అంతేకాకుండా కో బ్యాంకు చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కోహెడ మండలం నాగసముద్రాల నుంచి గ్రామానికి 11 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం వేయించారు. ఈ దొరలు గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం రెండున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.
చారిత్రక ఆనవాళ్లు
గట్లమల్యాల గ్రామంలో ఎక్కడ చూసినా రాతి నేల కనిపిస్తుంది. పొలాల్లో మెన్హిర్ (నిలువురాళ్లు), మెగాలిథిక్ సమాధుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొత్త రాతియుగపు రాతి పనిముట్లు ఇక్కడ బయటపడటంతో ఈ గ్రామా నికి ప్రాచీన చరిత్ర ఉందని తెలుస్తున్నది.
మూడు తరాల పాలన
సీతారామారావు తర్వాత ఆయన కు మారుడు రాంకిషన్ రావు పాలనా బాధ్యతలు చేపట్టారు. రాంకిషన్ రావు కుమారు డైన సత్యనారాయణరావుకు ముగ్గురు కొడుకులు. రాంకిషాన్ రావు(రామకృష్ణ), యాదగిరిరావు, వెంకటేశ్వరరావు, ఇద్దరు కూతుళ్లు సరోజన, విజయలక్ష్మి. తన ముగ్గురు కుమారులకు సత్యనారాయణరావు మూడు గడీలను నిర్మించారు. వాటిని ప్రజలు పెదదొరగడీ, నడిపిదొరగడీ అని పిలుస్తారు. పెద్దదొరగడి మట్టి, గూనపెంకులతో నిర్మిస్తే.. మిగిలిన రెండు గడీలు డంగుసున్నంతో అందమైన అలంకరణతో నిర్మించారు. గడీ పక్కనే మైసమ్మ గుడి ఉంది. యాదగిరిరావుకు గుర్రాలంటే చాలా ఇష్టం ఉండటంతో ఆయన కోసం గుర్రపు శాలలు కూడా నిర్మించారు. ధాన్యం నిల్వ చేయడానికి గాజెలు(గరిసెలు)ఉన్నాయి.
మేకల ఎల్లయ్య
సిద్దిపేట
దొరలపై ఒక్కదాడి జరగలేదు!
నిజాం నవాబుల పాలనలో వెలమదొరలు, దేశ్ముఖ్లు నిజాంకు సామంతులుగా ఉన్నారు. అయితే మా గట్లమల్యాలలో అవుసులోళ్లు నిజాం పాలకులుగా ఉన్నారు. వాళ్లు భూస్వాములుగా పెద్ద పెద్ద గడీల్లో ఉన్నా వాళ్లమీద ప్రజలల్లో వ్యతిరేకత రాలేదు. వాళ్లమీద కమ్యూనిస్టుల దాడులు కూడా జరగలేదు. అంతటా వెలమదొరలు, దేశ్ముఖ్లమీద దాడులు జరిగినయ్. వాళ్లను కమ్యూనిస్టులు ఊర్లళ్ల నుంచి తరిమేసిండ్రు. ఊరంతా ఉన్నవాళ్ల భూములను వాళ్ల కింద పనిచేసినవారికి, ఊరి ప్రజలకు అగ్గువధరకే అమ్ముకున్నారు. ఇప్పటికీ ఊరికి సహాయం చేస్తరు.
ఎడ్ల భూంరెడ్డి, రిటైర్డ్ టీచర్
మాకు గొప్పగా అనిపిస్తది!
మా అవుసులోళ్లు దొరలుగా పేరు తెచ్చుకున్నందుకు మాకు గొప్పగా అనిపిస్తది. వాళ్లు పెద్ద పెద్ద గడీలు కట్టుకుని పెత్తందార్లుగా ఉన్నా కమ్యూనిస్టులు, జనాలు ఏమనలే. వాళ్లు ఊరుకు మంచి చేసిండ్రు. సుట్టు ఇరువై ఊర్లకే కాదు.. నైజాం ఏరియాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. నిజాందొరే వాళ్లకు కుర్చీ వేసి ఆయనతోటి సమానంగా కూసోబెట్టుకునేవాడట. వాళ్లు ఎన్నడూ అవుసులపని చెయ్యలేదట. ఒకసారి చిన్నదొర మా తాత రామానుజం దగ్గర ఏవో నగలు చేయించాడట.. మా అయ్య పాపయ్యచారి అవుసులదొరల గొప్పతనాన్ని మాకు కథలుగా చెప్పెటోడు. వాళ్ల గడీలపక్కనే మా ఇల్లు ఉన్నందుకు మాకు గొప్పగున్నది.
ఉప్పల వెంకటాచారి, స్వర్ణకారుడు