31-08-2025 12:53:29 AM
మహబూబాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా సుమారు 18 వేల సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నామని రాష్ర్ట సమాచార కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మోహ్సినా పర్వీన్, దేశాల భూపాల్ పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకుముందు పోలీస్ గౌరవ వందనం స్వీకరించి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాచార కమిషనర్లు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రకారం స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. ఇందుకోసం కేటాయించబడిన అధికారులు ఉద్యోగులు చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిశీలనలో అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. ఈ సందర్భంగా కమిషన్ ముందుకు వచ్చిన 12 శాఖలకు సంబంధించి 115 అర్జీలను కమిషనర్లు ప్రత్యేకంగా పరిష్కరించారు.