calender_icon.png 2 June, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమ పేలుడులో ముగ్గురు మృతి

01-05-2025 01:54:56 AM

  1. పేలుడుధాటికి ఒకరు.. శిథిలాల కింద ఇద్దరు 
  2. పరిశ్రమను మూసేయాలని గ్రామస్థుల ఆందోళన
  3. బాధితులకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో మంగళవారం సంభవించిన పేలుళ్లలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. పేలుడు జరిగిన సమయంలోనే ఒకరు మృతిచెందగా, శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు లభించాయి. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పేలుళ్ల దాటికి కాటేపల్లి ఉలిక్కిపడింది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించింది. శకలాలు ఎగిరిపడి గ్రామంలోని పలు ఇళ్లపై పడ్డాయి. భారీ పేలుళ్లతో ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. పరిశ్రమను మూసేయాలని, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని బుధవారం ఆందోళనకు దిగారు.

పగబట్టిన విధి..

కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమ 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 110 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇస్రో శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ సమయంలో ఉపయోగించే ప్రొపలెంట్‌ను ఈ పరిశ్రమలో తయారు చేస్తారు. పరిశ్రమలోని 18 ఏ బ్లాక్‌లో 9 మంది విధుల్లో ఉన్నారు. ప్రొపలెంట్ మిక్సింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది.

మరో 15 నిమిషాలు ఉండి ఉంటే ఆ బ్లాక్‌లోని వారు విధులు ముగించుకుని వెళ్లిపోయేవారు. కానీ, వీధి వారిపై పగబట్టి మృత్యువు వెంబడించింది. పేలుడులో ఆత్మకూరు మండలానికి చెందిన కాలువల నరేశ్(30)ను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాటేపెల్లికి చెందిన గునుగుంట్ల సందీప్ (30), మోటకొండూరుకు చెందిన దేవిచరణ్ (22) భవన శిథిలాల కింద చిక్కుకొని కన్నుమూశారు.

సందీప్ భార్య 8 నెలల గర్భిణి. తీవ్ర గాయాలపాలైన బుగ్గ లింగస్వామి, నంద మహేందర్, రాజబోయిన శ్రీకాంత్, బర్ల శ్రీకాంత్, మహేశ్, ఎస్ మహేశ్ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డిని  మృతుల కుటుంబాలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలపై పార్లమెంట్ బోర్డ్‌కు ఫిర్యాదు చేస్తా

భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి  

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలలో వరుసగా జరుగుతున్న పేలుళ్ల ఘటనలపై పార్లమెంట్ బోర్డ్‌కు ఫిర్యాదు చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి తెలిపారు.

మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఉన్న ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలో జరిగిన భారీ పేలుళ్లలో ముగ్గురు కార్మికులు మృతిచెందడంతో పాటు ఆరుగురికి తీవ్రగాయాలు కావడం పట్ల ఎంపీ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీ, ప్రభుత్వ విప్ కాటేపల్లి ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్థుల డిమాండ్ మేరకు పరిశ్రమ తొలగింపునకు కృషిచేస్తానన్నారు. కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రీమియర్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఎంపీ, ప్రభుత్వ విప్ ఆరోపించారు.