26-05-2025 12:00:00 AM
యుగకవి
కాలరేఖను అందించిన
నవయుగ కవి
అభ్యుదయ భావుకుడు
సాహిత్యం లోతెరిగిన విమర్శకుడు
సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో మేటి
వచనం, పద్యంలోనూ సవ్యసాచి
విలక్షణత, ఊహాశీలత
ఆయన కవిత్వపు ప్రత్యేకత
తాను పిడికెడు మట్టే కావచ్చు
తన కలానికి మాత్రం
ఒక దేశపు జెండాకు ఉన్నంత
పొగరు ఉందని చెప్పిన
కవితాధీమంతుడు
‘నా దేశం నా ప్రజలు’ అన్న
కవి నాయకుడు
దేశానికి నాగలిని
ప్రతీక చేసి చూపిన దార్శనికుడు
ఆధునిక భారతం
తేజోప్రభగా వికసించాలని
కోరుకున్న ప్రగతిశీలి
భారతీయ, ప్రపంచ సాహిత్యాలను
శోధించి, మదించి
సాధికారతను సాధించిన
పండిత వైతాళికుడు
శేష జ్యోత్స్న శేషేంద్రుడు
షోడషిని తెలిపి
గొర్రిల్లాను చూపినవాడు
కవుల కోసం
తానొక కవిగా మేనిఫెస్టో
రాసిన వాడు
విశిష్ట కవికుల తిలకుడు
ఆధునిక వాగనుశాసనుడు
సెగ నిప్పుల అక్షరమై
చివరంటా పోరాడిన
విశ్వ మానవతా కవితారవి
అతను కాలాతీత కవి !
(30న గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి సందర్భంగా)