09-08-2025 11:12:27 PM
కేసముద్రంలో నిలిచిన ఇంటర్ సిటీ, వందే భారత్ రైళ్లు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): విజయవాడ - కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కేసముద్రం రైల్వే స్టేషన్(Kesamudram Railway Station) సమీపంలో గుంటూరు సికింద్రాబాద్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీని కారణంగా విజయవాడ - కాజీపేట మార్గంలో పలు రైలు రాకపోకలకు గంటపాటు అంతరాయం కలిగింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కేసముద్రం రైల్వే స్టేషన్లో సుమారు 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎయిర్ వ్యాక్యూమ్ (గ్యాస్) పైపుకు సంబంధించిన సమస్య తలెత్తడంతో 420 కిలోమీటరు వద్ద నిలిచిపోయింది. రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది సాంకేతిక సమస్యను గుర్తించి లోపాన్ని సరి చేయడంతో రాత్రి 9:45 ప్రాంతంలో రైలు బయలుదేరింది. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా కేసముద్రం నుంచి సికింద్రాబాద్ వెళ్లిపోయింది. ఈ రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు గంట పాటు ఇబ్బందులు పడ్డారు.