21-09-2025 01:39:28 AM
* బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో కాంగ్రెస్ పాలనను ప్రజలు పోల్చిచూసుకుంటున్నారు (రీకాల్), బీఆర్ఎస్ను గెలిపించుకోనందుకు బాధపడుతున్నారు (రిగ్రెట్), త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉంది(రివోల్ట్).
బీఆర్ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చిచూసుకుంటున్నారని(రీకాల్), బీఆర్ఎస్ను గెలిపించుకోనందుకు బాధపడుతున్నా రని (రిగ్రెట్), త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉందని(రివోల్ట్) స్పష్టం చేశారు.
యువత ఆకాంక్షలను ప్రభుత్వా లు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్--మసీద్, ఎవరు ఏం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం సాధించారని దుయ్యబట్టారు.
దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను మోదీ గాలికొదిలేశారన్నారు. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకొని సంతృప్తి చెందడం సరికాదన్నారు. శనివారం ముంబైలో జరిగిన ‘ఎన్డీటీవీ యువ 2025-ది ముంబై ఛాప్టర్’ సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రస్తుత తరం యువత (జెన్ కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావొద్దని, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలన్నారు. జెన్- శక్తిని తక్కువ అంచనా వేయద్దని పాలకులను హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతంగా పోరాడి ప్రభుత్వ మెడలు వంచిన విషయాన్ని గుర్తుచేశారు.
చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసు కుని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందని, ఇదే జెన్--జీ పవర్ అని ఉదహ రించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత, రాజకీయాల్లోకి కూడా రా వాలన్నారు. ‘రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు, మీరే ఎందుకు రాజకీయాలను నిర్ణయించలేరు?’ అని కేటీఆర్ యువతకు పిలుపునిచ్చారు.
యువశక్తిని వాడుకోవడంలో పాలకులు విఫలం...
ప్రపంచం అంతా ముసలితనంలో ఉంటే భారతదేశం మాత్రం యువరక్తంతో ఉరకలెత్తుతోందన్నారు. ఈ యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫల మవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో చైనా, భారత ఆర్థిక వ్యవస్థలు దా దాపు సమానంగా ఉండేవన్నారు. అప్పుడు చైనా తలసరి ఆదాయం 300 డాలర్లు అయితే మనది 500 డాలర్లు ఉండేదని, కా నీ 40 ఏళ్ల తర్వాత చూస్తే, ఇండియా ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకే పరిమితం అయితే, చైనా 20 ట్రిలియన్ డాలర్లకు ఎదిగిందని వివరించారు.
ప్రస్తుతం చైనా తలసరి ఆదాయం 13,000 డాలర్లు అయితే మనది కేవలం 2,700 డాలర్లే అన్నారు. చైనా మన ల్ని ఎలా దాటిపోయిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. అమెరికా, యూరప్లతో చైనా పోటీపడితే, మనం మాత్రం పాకి స్థాన్, బంగ్లాదేశ్లతో పోల్చుకుని మురిసిపోతున్నామని ఎద్దేవా చేశారు. అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్, కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించిందని కేటీఆర్ గుర్తుచేశారు.
1945లో హీరోషిమా, నాగసాకిలపై అణుదాడి జరిగి లక్షలాది మంది చనిపోయినా జపాన్ కుంగిపోలేదన్నారు. ఎన్నో భౌగోళిక అననుకూలతలు ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా వాటన్నింటిని తట్టుకుని అద్భుత ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణతో నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఎదిగిందన్నారు. జపాన్ సాధించినప్పుడు భారతదేశం ఎందుకు సాధించలేకపోయిందో ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు.
తెలంగాణకు సాధ్యమైనప్పుడు దేశానికి ఎందుకు కాదు...
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉందని, ప్రపంచంలోనే అమెజాన్కు అతిపెద్ద క్యాంపస్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబా ద్లో ఉందని వివరించారు. కేవలం 10 సంవత్సరాల్లోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందు కు చేయలేకపోయిందని కేటీఆర్ నిలదీశారు.
సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికన్ కంపెనీలకు సీఈవోలు అయితే మనం సంతోషిస్తాం కానీ, మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మనకు వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలన్నారు. మనదేశంలోని 38 కోట్ల జెన్- యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్నారు. ‘పెట్టుబడి లేకపోవడం కాదు.. మీ ఊహాశక్తి, ఆశయాలే మిమ్మల్ని ఆపుతున్నాయంటూ’ యువతలో కేటీఆర్ స్ఫూర్తి నింపారు.